ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన “శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రాలు ఒక ట్రెండ్ సృష్టించాయి. దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ని మళ్లీ మళ్లీ అనుసరించటం ఆయనకు ఇష్టం ఉండదు. ఏం చేసినా ప్రేక్షకులకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం. అందుకోసమే ఆయన ‘అగధ’ను సిద్ధం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే అహరహం శ్రమిస్తున్నారు.

‘అగధ’ ప్రమోషన్స్ విభిన్నంగా మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు దొంగలు ఎమ్మెస్ రాజు ఆఫీసులో దొంగతనానికి వెళ్లడం, అక్కడున్న సినిమా పోస్టర్స్ ని చూస్తూ ఆ దొంగలు ఆ సినిమా జ్ఞాపకాలను తలుచుకోవడం, చివరగా ఒక పోస్టర్ ని చూసి అక్కడ ఏదో ఉందని భయపడటంతో ఆ వీడియో ఎండ్ అవుతుంది. తీరా అక్కడ ఉన్నది ‘అగధ’ సినిమా పోస్టర్ .
ఆ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు.
ఒక చీకటి గుహ.
చుట్టూ వెలుగుతోన్న కొన్ని కాగడాలు.
చీకటే కాదు ఆ సన్నని వెలుతురు కూడా భయానకంగా ఉంది.
అక్కడ ఒక భారీ విగ్రహం.
మొహమంతా మిస్టిక్ గా ఉంది.
ఆ విగ్రహానికి 12 చేతులు.
ఈ విగ్రహం ముందు … వెనుతిరిగి ఉన్న ఒకమ్మాయి . ఆమె వేషధారణ కూడా చాలా విభిన్నంగా ఉంది.ఈ పోస్టర్ తోనే ఒక ఆసక్తిని జనరేట్ చేశారు ఎమ్మెస్ రాజు.

మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా ‘అగధ’ను రూపొందిస్తున్నారాయన. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం ‘అగధ’. కాశీ విశాలాక్షి బలుసు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘అగధ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రం గురించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ “ఇదొక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. ఇందులో నటించిన తారలు ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. రకరకాల సెట్లు, విభిన్న లొకేషన్లలో 85 రోజులు షూటింగ్ చేసాం. ఈ సినిమాలో 45 నిమిషాల వి ఎఫ్ ఎక్స్ ఉంటుంది. దాన్నిబట్టే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. వి. ఎన్. సుబ్బరాజ్ , నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు, రచన- దర్శకత్వం: ఎమ్మెస్ రాజు.

