అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.’మీర్జాపురంరాణి -కృష్ణవేణి’ పుస్తకాన్ని రచయిత భగీరథ, నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవి వెంకయ్య నాయుడుకి బహుకరించారు .

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ … “తెలుగు సినిమా ప్రారంభ రోజుల్లో బాల నటిగా ప్రవేశించి, కథానాయికగా ఎదిగిన కృష్ణవేణమ్మ మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది” అని చెప్పారు.
“కృష్ణవేణమ్మ కేవలం నటి, గాయనిగానే కాదు అభిరుచి కలిగిన నిర్మాత, ఎన్నో సందేశాత్మక సినిమాలను రూపొందించారు. ముఖ్యంగా ఎన్ .టి . రామారావు ని ‘మనదేశం ‘సినిమాతో పరిచయం చేశారు. అందుకే ఆమె అంటే నాకు గౌరవం” అని వెంకయ్య నాయుడు చెప్పారు. “అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి వెంకట్రామయ్య, సిహెచ్.నారాయణ రావు, ఘంటసాల, రమేష్ నాయుడు, త్రిపురనేని గోపీచంద్, తాపీ ధర్మారావు, చిత్రపు నారాయణ మూర్తి లాంటి వారికి చేయూత నిచ్చిన కృష్ణవేణమ్మ చిరస్మరణీయురాలు” అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు .

విజయవాడలో 2024 డిసెంబర్14న ‘మనదేశం’ సినిమా వజ్రోత్సవ వేడుకలు , ‘తారకరామం’ పుస్తకావిష్కరణ సభలో తాను, ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కలసి కృష్ణవేణమ్మను సత్కరించామని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు .
“మీర్జాపురంరాణి -కృష్ణవేణి ” పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను, నిర్మాత ఎన్ .ఆర్ .అనురాధాదేవి ని వెంకయ్య నాయుడు అభినందించారు.

