



విజేతలకు షీల్డ్, శాలువా నగదు బహుమతులతో సత్కారం
బహుముఖ ప్రతిభాశాలి నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “కథ – మాటలు – స్క్రీన్ ప్లే – సంగీతం – దర్శకత్వం”లో తెరకెక్కిన చిత్రం “సంత”. “మట్టి మనుషుల ప్రేమకథ” ట్యాగ్ లైన్. సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై బి.ఎస్.జె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ ఆత్రేయ సహ నిర్మాత. సూర్య భరత్ చంద్ర – శ్రావ్యారావు జంటగా నటించిన ఈ చిత్రంలో కిన్నెర, మధుమణి, ఆలపాటి లక్ష్మీ, ఉదయశ్రీ, స్వపన్ మండల్, ఆర్.ఎస్.నందా, దుర్గేష్, అమరేందర్ మరియు జబర్దస్త్ ఫణి కీలక పాత్రలు పోషించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “సంత” చిత్రానికి చిత్రకళా పోటీ నిర్వహించారు. “మీరు చూసిన వారాంతపు సంత” అనే కాన్సెప్ట్ తో నిర్వహించిన కాంపిటీషన్ లో వందలాదిమంది చిత్రకళా నిపుణులు పాల్గొన్నారు. వారిలో 50 మంది విజేతలను ఎంపిక చేసి, వారు గీసిన “సంత చిత్రాలను” నెహ్రు ఆర్ట్ గ్యాలరీలో రెండు రోజులపాటు ప్రదర్శించారు. వీరి నుంచి పది మందిని ప్రోత్సాహక బహుమతులకు… ముగ్గుర్ని ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి, నెహ్రు ఆర్ట్ గ్యాలరీలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో షీల్డులు, శాలువాలతో సత్కరించి, నగదు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లేశం, క్రియేటివ్ హార్ట్స్ అధినేత అంజి ఆకొండి, జబర్దస్త్ ఫణి, భోలే శావలి, మౌనశ్రీ మల్లిక్, పసునూరి రవీందర్, అతిథులుగా పాల్గొని, విజేతలను అభినందించి, నగదు బహుమతులను అందించారు. వి.వి.రామారావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ… “నేను స్వతహా చిత్రకారుడ్ని కావడం వల్ల…. నా సినిమా కాన్సెప్ట్ మరియు, టైటిల్ కి తగ్గట్లుగా చిత్రకళా పోటీ నిర్వహించాలని చేసిన ప్రయత్నానికి ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదు. ఎంపిక చేసిన 50 మంది విజేతల చిత్రాలను… “సంత” సినిమా చివరిలో జత చేసి చూపిస్తాం. అలాగే… ఈ పోటీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలను “సంత” ఆడియో విడుదల వేడుకలో కూడా ఘనంగా సత్కరిస్తాం. అదే రోజు సంత విడుదల తేదీ ప్రకటిస్తాం” అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఫణీoద్రవర్మ, మాటలు; ఎస్.కె.అనీఫ్ – పసునూరి రవీందర్, పాటలు: గోరేటి వెంకన్న, కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, మాట్ల తిరుపతి, పసునూరి రవీందర్, నిర్మాత: బి.ఎస్.జె, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – సంగీతం – దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర!!

