
నటుడు సాయికుమార్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఆయన్ను తలచుకోగానే ముందు గుర్తుకు వచ్చేది ఆ గంభీరమైన గాత్రం, ఆకట్టుకునే వాచకం. ఆయన గళం ఎంతో మందిని హీరోలగా నిలబెట్టింది. ఆ గళమే ఆయనకు తిరుగులేని హీరోగా, నటుడిగా కెరీర్ను ఇచ్చింది. ‘డైలాగ్ కింగ్’గా సాయి కుమార్ దక్షిణాది చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. కుటుంబం సినీ రంగంతో అనుబంధం కలిగి ఉంది. నటుడు పి.జె.శర్మ తనయుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే సాయి కుమార్ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చకున్నారు. 1961 జూలై 27న జన్మించిన సాయికుమార్ రీసెంట్గానే సినీ పరిశ్రమలో యాభై ఏళ్ల సుధీర్ఘమైన మైలురాయిని చేరుకున్నారు. సాయి కుమార్ ఇలానే మరెన్నో గొప్ప పాత్రలతో మెప్పిస్తూ, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని కోరుకుందాం.
కెరీర్ ప్రారంభంలోనే సాయికుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో హీరోలకు, ఇతర పాత్రలకు సైతం తన స్వరాన్ని అందించారు. ఆయన డబ్బింగ్ చెప్పిన తొలిచిత్రం ‘సంసారం’. కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా మెప్పించారు. బాలనటుడిగా సాయికుమార్ చేసిన తొలి సినిమా ‘దేవుడు చేసిన పెళ్లి’. అయితే సాయి కుమార్కి కన్నడలో ముందుగా క్రేజ్ లభించింది. ‘పోలీస్ స్టోరీ’ కన్నడలో భారీ విజయం సాధించిన తర్వాత తెలుగులోకి డబ్బింగ్ చేయగా ఇక్కడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలా సాయి కుమార్కి తిరుగులేని క్రేజ్ వచ్చింది.
ఇప్పుడు సాయి కుమార్ తన సెకండ్ ఇన్నింగ్స్లో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రవితేజ ‘ఇరుముడి’, ‘ధర్మస్థల నియోజక వర్గం’, ‘సంబరాల ఏటిగట్టు’, నాగార్జున వందో చిత్రం, ఎస్వీ కృష్ణారెడ్డి వేదవ్యాస్, కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో ఓ సినిమా, రోషన్ మేక ‘ఏమో ఏమో ఇది’, విశ్వక్ సేన్ చిత్రం, సిద్దు జొన్నలగడ్డ ‘లుంగీ మాన్’, నితిన్-నాని మూవీ, సత్యదేవ్ ఫుల్ బాటిల్ సినిమా, వరుణ్ తేజ్ బరి, వరలక్ష్మీ శరత్ కుమార్ కూర్మావతారం, సాయి ప్రకాష్ సాయి బాబా సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
అంతే కాకుండా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మూడు లాంతర్లు’, కన్యాశుల్కం వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇక కన్నడలో శివ రాజ్ కుమార్ ‘బైల్’, నిరూప్ బండారి రూపొందిస్తున్న ‘సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర’, సుదీప్ బిల్లా రంగా భాషా చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇలానే సాయి కుమార్ మరెన్నో గొప్ప పాత్రలతో మెప్పిస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుందాం.

