ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు నిర్మాత బన్నీవాస్. పరిశ్రమలోని మూల సమస్యలకు పరిష్కారం చూడకుండా వచ్చే ఆదాయంలో ఎవరెంత పంచుకోవాలి అని చర్చించుకోవడం వల్ల ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. స్టార్ హీరోలు వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చేయాలని, 27 రోజుల ఓటీటీ విండోకు మరింత సమయం తీసుకోవాలని ఆయన సూచించారు. మంచి కంటెంట్ తో సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలని అప్పుడే థియేటర్స్ కు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపిస్తారని బన్నీ వాస్ అభిప్రాయపడ్డారు.

పెద్ద సినిమాల ఆదాయం రూపాయికి సగానికి సగం తగ్గిపోగా, చిన్న సినిమాల ఆదాయం రూపాయికి పావలాకు పడిపోయిందని బన్నీవాస్ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రేట్ల పెంపు, ఇతర ధరల పెంపు వల్ల వచ్చిన కలెక్షన్స్ ను గొప్పగా చెప్పుకుంటున్నామని, ఇది ప్రేక్షకుల మీద భారం వేయడమే అని బన్నీవాస్ అన్నారు. ఈ పరిస్థితి నిర్మాతలతో పాటు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారనేది వాస్తవమని ఆయన చెప్పారు. తినుబండారాల ధరలు కూడా అదుపులో ఉంచాలన్నారు. ఇలాంటి మూల సమస్యలు వదిలేసి తగ్గిపోయిన ఆదాయం మీద పోరాడితే ఏం లాభం అంటూ బన్నీ వాస్ ప్రశ్నించారు.

