ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడుగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎంతోమంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు.
ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాగ్ మయూర్ ఒకరు. “సినిమా బండి” సినిమా తోనే విలక్షణమైన హీరోగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అద్భుతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ కెరియర్ లో ఆచితూచి ముందడుగు వేస్తున్నాడు. తను ఏ పాత్ర చేసిన చాలా సహజంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

“సినిమా బండి” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఆ సినిమాను తీసిన విధానం, ఆ సినిమాలో నటులు ఒదిగిపోయిన తీరు ప్రతి ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో మరిడేష్ బాబు అనే పాత్రలో కనిపించిన రాగ్ మాయూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక పాత్రలో నటించడం వేరు, ఆ పాత్రలా ప్రవర్తించడం వేరు. మరిడేష్ బాబు పాత్రలో రాగ్ మయూర్ ర్ నటించాడు అనేకంటే ప్రవర్తించాడు అని చెప్పాలి. ఆ సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో పాటు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి.
అయితే తాను ఏ పాత్ర చేసిన ఒక ప్రత్యేకత ఉంటుందని ఇప్పటివరకు రాగ్ మయూర్ చేసిన సినిమాలను బట్టి చెప్పొచ్చు. ప్రతి పాత్ర దేనికది ప్రత్యేకం. సినిమా బండి తర్వాత మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా కీడాకోలా. ఈ సినిమాలో లంచం అనే పాత్రలో కనిపించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. సినిమా బండి సినిమాలో రాయలసీమ యాసను మాట్లాడటమే కాకుండా, కీడాకోలా సినిమాలో తెలంగాణ యాసను కూడా అద్భుతంగా మాట్లాడి ఆడియన్స్ ను సప్రైజ్ చేశాడు. అలానే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన “వీరాంజనేయులు విహారయాత్ర” సినిమా కూడా మంచి పేరును తీసుకొచ్చింది.

రీసెంట్ గా పంచాయత్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సివరపల్లి వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాలో శ్యామ్ అనే పాత్రలో కనిపించాడు రాగ్ మయూర్. ఇంజనీరింగ్ చదువుకొని అమెరికా వెళ్లాలి అనుకునే ఒక కుర్రోడు సివరిపల్లి అనే ఒక ఊరికి పంచాయతీ సెక్రటరీగా వెళ్లడం, అక్కడ జరిగే కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా, సహజంగా అనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో రాగ్ మయూర్ నటించిన విధానం వర్ణనాతీతం అని చెప్పాలి. అందుకే ఈ వెబ్ సిరీస్ చాలామందికి విపరీతంగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్ దాదాపు రెండు వారాలు పాటు ట్రెండింగ్ సెకండ్ ప్లేస్ లో ఉండటం అనేది మామూలు విషయం కాదు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు తమ జన్యున్ ఒపీనియన్ ను సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. సుకుమార్ కూతురు సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు సినిమాకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు రాగ్ మయూర్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఒకే రోజు రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా రాగ్ కెరియర్ లో ఒక అరుదైన అంశం.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫహద్ ఫాజిల్, రాజ్ కుమార్ రావ్ వంటి ప్రత్యేకమైన నటులులా రాగ్ మయూర్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్ అప్పట్లో కొన్ని అద్భుతమైన సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ఒక పంథాను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో అటువంటి సినిమాలు చేసే దర్శకులు నటులు అరుదుగా ఉన్నారు. ఈ జనరేషన్ లో అలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరో రాగ్ మయూర్. ప్రస్తుతం రాగ్ మయూర్ గరివిడి లక్ష్మి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసను రాగ్ మయూర్ మాట్లాడబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా కూడా రాగ్ కెరియర్ కు ప్లస్ కాబోతోంది.
రాగ్ మయూర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని ఒక స్థాయి నమ్మకం చాలా మంది ప్రేక్షకులకు వచ్చేసింది.